ఇళ్ల స్థలాలకు భూమిచ్చారని దాడి

4 Jul, 2020 08:38 IST|Sakshi

గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం

క్రోసూరు (పెదకూరపాడు): గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఘాతుకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పేదలకిచ్చే ఇంటి స్థలాల నిమిత్తం ప్రభుత్వానికి పొలం ఇచ్చిన రైతులపై టీడీపీ కార్యకర్తలు గడ్డ పలుగుతో దాడి చేసిన ఘటన క్రోసూరు మండలం బాలెమర్రు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు శ్రీనివాసరావు, అతని అల్లుడు కంకణంపాటి శ్రీధర్‌ కథనం మేరకు.. బాలెమర్రు గ్రామంలోని ఎస్సీలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు శ్రీనివాసరావు, శ్రీధర్‌ 1.23 ఎకరాల పొలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు.

ఈ పొలంలో సర్వేయర్, సహాయకులు వచ్చి శుక్రవారం సాయంత్రం కొలతలు వేసి.. మార్కింగ్‌ చేస్తుండగా పక్క పొలానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ముసులూరి సాంబశివరావు, ముసులూరి కృష్ణారావు, బొబ్బా వెంకటేశ్వరావు, బొబ్బా రాధాకృష్ణ, తాళ్లూరి లక్ష్మీనారాయణ వచ్చి ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం పొలం ఎందుకిచ్చారంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. గడ్డ పలుగుతో దాడి చేశారు. దీంతో శ్రీనివాసరావు, శ్రీధర్‌ భయపడి పారిపోయారు. అనంతరం వారిద్దరూ కారులో ఎస్సీ కాలనీకి వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని గడ్డపలుగుతో కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు చప్పిడి శ్రీను, మల్లెల హరి, పెద్దింటి దేవునిదయ, మేళం థామస్‌తో కలిసి బాధితులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.
(చదవండి: బినామీ ‘బాబు’కు చెక్‌

మరిన్ని వార్తలు