టీవీ నటుడి హఠాన్మరణం.. షాకింగ్‌గా ఉంది..

27 Dec, 2019 10:30 IST|Sakshi

ముంబై: టీవీ నటుడు కుశాల్‌ పంజాబీ మరణవార్త హిందీ టెలివిజన్ పరిశ్రమలో విషాదం నింపింది. చిన్న వయస్సు(37)లోనే కుశాల్‌ హఠాన్మరణం చెందడంతో తోటి నటులు శోకసంద్రంలో మునిగిపోయారు. రియాలిటీ షో జోర్‌ కా జట్కాలో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన కుశాల్‌.. టీవీ నటుడిగా గుర్తింపు పొందాడు. ఫియర్‌ ఫాక్టర్‌, నౌటికా నావిగేటర్స్‌ ఛాలెంజ్‌, ఝలక్‌ దిఖ్లా జా వంటి రియాలిటీ షోల్లో పాల్గొని అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేగాకుండా ఫర్హాన్‌ అక్తర్‌ లక్ష్యా, కరణ్‌ జోహార్‌ కాల్‌ సినిమాలతో బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించాడు.

కాగా టీవీ నటుడు కరణ్‌ వీర్‌ బోహ్రా కుశాల్‌ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ‘నువ్వు ఈ లోకంలో లేవంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. అయితే నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి.. ఉంటావు కూడా. కానీ ఇది మాటలకు అందని విషాదం. నీ జీవితం నాకు ఆదర్శప్రాయం. డ్యాన్సింగ్‌ స్టార్‌గా, ఫిట్‌నెస్‌ కలిగిన వ్యక్తిగా.. గొప్ప తండ్రిగా ఎప్పటికీ గుర్తుండిపోతావు. మిస్‌ యూ అని కుశాల్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. కరణ్‌ పోస్టుతో అతడి మరణ వార్తను తెలుసుకున్న సెలబ్రిటీలు షాక్‌కు గురవుతున్నారు. ‘ఇది అబద్ధం అయితే బాగుండు. తను ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి’ అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కాగా కుశాల్‌ ఆకస్మిక మృతికి గల కారణాలు తెలియరాలేదు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు.

మరిన్ని వార్తలు