మాలిక్‌ వెకిలి చేష్టలు.. నెటిజన్లు ఫైర్‌

27 Dec, 2019 10:34 IST|Sakshi

హైదరాబాద్‌: భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ మరోసారి తన బుద్ధి చూపించుకున్నాడు. భారత్‌ అంటే అక్కసు వెల్లగక్కే పాక్‌ నేతలు, క్రికెటర్లు మరోసారి తమ దుర్బుద్దిని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. తాజాగా మాలిక్‌ క్రిస్మస్‌ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ‘మేరీ క్రిస్మస్‌ దోస్తోం.. వెరీ హ్యాపీ డిసెంబర్‌ 25’ అంటూ ఓ ఫోటో షేర్‌ చేశాడు. ఈ ఫోటోలో మాలిక్ విజయం సాధించిన సంతోషంలో సంకేతాన్నిచ్చాడు. మరోఎండ్‌లో నిరాశగా వెనుదిరిగుతున్న ధోనీ ఫొటో ఉంది. దీంతో భారత ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే మాలిక్‌ను టార్గెట్‌ చేస్తూ ట్రోల్‌ చేయడం ప్రారంభించారు.  

2012, డిసెంబర్‌ 25న టీమిండియా-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన తొలి టీ20లో పాక్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మాలిక్‌ ఆర్ధసెంచరీతో రాణించి పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే విజయానంతరం భారత ఆటగాళ్లను గేలి చేస్తూ మాలిక్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు. అప్పట్లో మాలిక్‌ ప్రవర్తనపై బహిరంగ విమర్శలు వచ్చాయి.

తాజాగా ఆ మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోను షేర్‌ చేస్తూ తన అహంకారాన్ని ప్రదర్శించాడు. ఇక మాలిక్‌ షేర్‌ చేసిన ఫోటోతో ఆగ్రహించిన నెటిజన్లు ధీటుగా బదులిస్తున్నారు. తాజా ప్రపంచకప్‌లో మాలిక్‌ డకౌటైన ఫోటో, రోహిత్‌ కాళ్ల ముందు మాలిక్‌ పడిపోయిన ఫోటో, మాలిక్‌ను ధోని స్టంపౌట్‌ చేస్తున్న ఫోటోలను రిట్వీట్‌ చేస్తూ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీటితో పాటు ఆసియా కప్‌లో పాక్‌ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించిన విషయాన్ని కూడా కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అసందర్భమైన సమయంలో వేలు పెట్టి కంపు కంపు చేసుకున్నాడని కొందరు, అత్యుత్సాహం అన్ని వేళలా పనికిరాదని మరి కొందరు మాలిక్‌కు సూచిస్తున్నారు.

చదవండి:
మా తొలి పరిచయం అలా: సానియా మీర్జా
సానియాతో స్టెప్పులేసిన రామ్‌చరణ్‌

మరిన్ని వార్తలు