అనుమతులు లేకుండా స్వీట్‌ డ్రింక్‌ తయారీ

20 Jul, 2018 11:25 IST|Sakshi
స్వీట్‌ డ్రింక్‌ బాటిళ్లను సీజ్‌చేస్తున్న అధికారులు

విజిలెన్స్, ఫుడ్‌ క్వాలిటీ అధికారులు దాడులు

విశాఖ సిటీ ,చోడవరం: అనుమతులు లేకుండా స్వీట్‌ డ్రింక్స్‌ తయారుచేస్తున్న సెంటర్‌పై విజిలెన్స్, ఫుడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు గురువారం దాడులు చేశారు. చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఈ సెంటర్‌పై రెండు శాఖల అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. లోకల్‌ డ్రింక్‌ పేరుతో  ఇక్కడ తయారుచేస్తున్న స్వీట్‌ డ్రింక్‌ను పాత పెప్సీ, బ్రీజర్, ఇతర సీసాల్లోనింపి గ్రామీణ ప్రాంతంలో విక్రయిస్తున్నారు. నీటిలో పంచదార, ఎసెన్స్, కొన్ని రంగులు ఒక మిషన్‌ ద్వారా మిక్స్‌చేసి ఆ ద్రావణాన్ని సీసాల్లో నింపి అమ్ముతున్నారు. సంపత్‌ వినాయక సంతోషిమాత డ్రింక్‌ పేరున నడుస్తున్న  ఈ లోకల్‌ డ్రింక్‌ తయారు చేసేందుకు ఫుడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో దాడులు చేసినట్టు విజిలెన్స్‌ అధికారులు  తెలిపారు.

అనుమతులు లేకుండా శీతల పానీయం తయారీ చేయడం వల్ల ప్రజలకు ప్రమాదమని, ఈ మేరకు ఈ సెంటర్‌పై దాడి చేసి కేసు నమోదుచేసినట్టు విజిలెన్స్‌ డీఎస్పీ పి.ఎం. నాయుడు, ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వరరావు, ఫుడ్‌ సేఫ్టీ అధికారి బి.వేణుగోపాల్, గజిటెడ్‌ ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ కె. వెంకటరత్నం  తెలిపారు. అయితే ఉత్పత్తి చేసిన డ్రింక్స్, శీతలపానీయాలను విక్రియించేం దుకు ఫుడ్‌ కంట్రోల్‌ శాఖ నుంచి ఈ సెంటర్‌కు అనుమతి ఇస్తూ లైసెన్సు ఉంది. దీనిని పరిశీలించిన అధికారులను ఇక్కడ ఏ లేబుల్‌ లేకుండా స్వీట్‌ డ్రింక్స్‌ సీసాల్లో నింపి ఉన్న 15 కేసులను   అధికారులు సీజ్‌చేశారు. కొన్ని బాటిళ్లను శాంపిల్స్‌ కోసం సీజ్‌చేసి తీసుకెళ్తున్నట్టు ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు