ప్రియుడి కోసం భర్త దారుణ హత్య

10 Sep, 2019 17:13 IST|Sakshi

ఆర్మీ సిపాయి సతీష్‌ హత్య కేసును చేధించిన పోలీసులు

ప్రియుడితో కలిసి భార్య జ్యోతియే హత్య చేసింది

సాక్షి, విశాఖపట్నం : ఆర్మీ సిపాయి సతీష్‌ కుమార్‌ ఆత్మహత్య కేసును విశాఖ సిటీ పోలీసులు చేధించారు.  వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసులు నిర్థారించారు. ఈ కేసులో సతీష్‌ భార్య జ్యోతి, ఆమె ప్రియుడు భరత్‌ కుమార్‌, అతని స్నేహితుడు భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన సతీష్‌ సైన్యంలో పనిచేస్తున్నాడు. సతీష్‌ జమ్మూకశ్మీర్‌లో ఉండగా, భార్య జ్యోతి,  ఇద్దరు పిల్లలు  విశాఖ సిటీ మద్దిలపాలెంలో ఉంటున్నారు. ఈ క్రమంలో జ్యోతి భరత్‌ కుమార్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. జ్యోతి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె అత్త ఓ సారి మందలించింది.

కొద్ది రోజుల తర్వాత సతీష్‌ డ్యూటీకి నెల రోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో జ్యోతి వివాహేతర సంబంధం గురించి తెలుసుకొని ఆమెను నిలదీశాడు. తన వివాహేతర సంబంధం బట్టబయలు కావడంతో భర్తను హతమార్చాలని పన్నాగం పన్నింది జ్యోతి. ప్రియుడు భరత్‌తో కలిసి ప్లాన్‌ చేసింది. సతీష్‌ కుమార్‌ తాగే విస్కీలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. సతీష్‌ నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడు భరత్‌, అతని స్నేహితుడు భాస్కర్‌లకు ఫోన్‌ చేసి ఇంటికి రప్పించింది. ముగ్గురు కలిసి నిద్రమత్తులో ఉన్న సతీష్‌ మెడకి చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం అదే చున్నీతో ఫ్యాన్‌ ఫ్యాన్‌కి వ్రేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఏమి తెలియనట్లుగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. జ్యోతీ, భరత్‌, భాస్కర్‌లను అరెస్ట్‌ చేసిన సిటీ పోలీసులు మంగళవారం విశాఖ పోలీస్ కమీషనర్ ఆర్ కె మీనా ముందు హాజరు పరిచారు. 

మరిన్ని వార్తలు