భర్తను కత్తితో హతమార్చిన భార్య, కుమారుడు

15 Nov, 2019 11:39 IST|Sakshi

తగువే ప్రాణం తీసింది..!

మృతదేహంతో స్టేషన్‌ ఎదుట బంధువుల ధర్నా

సాక్షి, మునుగోడు: భార్య, భర్తల నడుమ ఘర్షణ ఓ ప్రాణం తీసింది. ఈ సంఘటన మండలం పరిధిలోని కస్తాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. 10వ తేదీన గ్రామంలో ముత్యాలమ్మ పండుగ జరిగింది. గ్రామానికి చెందిన యోహోవా(41) భార్య యాదమ్మ, కుమారుడు మనోజ్, తల్లి లక్ష్మమ్మ కలిసి పండుగ జరుపుకున్నారు.  అదే రోజు రాత్రి అత్త లక్ష్మమ్మతో కోడలు యాదమ్మ ఘర్షణకు దిగింది. ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో లక్ష్మమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత మద్యం మత్తులో ఇంటికి చేరిన భర్త యోహోవా అమ్మ కనిపించడం లేదని భార్యను ప్రశ్నించడంతో మొదలైన గొడవ తీవ్రస్థాయికి చేరింది. మద్యం మత్తులో ఉన్న భర్తపై భార్య, కుమారుడు కలిసి కత్తితో దాడి చేశారు. దీంతో యోహోవా సృహ కోల్పోయాడు. తల్లి, కుమారుడు రాత్రి ఇంట్లోనే పడుకున్నారు. సోమవారం ఉదయాన్నే లక్ష్మమ్మ పెద్ద మనుషులతో ఇంటికి వచ్చింది. రాత్రి జరిగిన విషయంపై ఆరా తీస్తూనే, కుమారుడి గురించి అడిగింది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి యోహోవా అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం నల్లగొండకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. పరిస్థితి విషమించి గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. 

స్టేషన్‌ ఎదుట ఆందోళన..
ఆదివారం జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తూ మృతుని బంధువులు మృతదేహాన్ని స్టేషన్‌ ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. యోహోను భార్యపై ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఎస్పీ వస్తేనే ఆందోళన విరమిస్తామని సీఐ సురేష్‌కుమార్‌తో వాదనకు దిగారు. నిందితులకు శిక్షపడేలా చూస్తామని సీ ఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
శిక్షపడేలా చర్యలు : సీఐ సురేష్‌ కుమార్‌ 
యోహోవా మృతికి సంబంధించిన సంఘటనపై విచారణ చేసి, దోషులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన ఇంట్లో ఏం జరిగిందో.. వివరాలు సేకరించే పనిలో ఉన్నాం. ఆందోళన చెందనవసరం లేదు. నిందితులను త్వరలో కోర్టుకు రిమాండ్‌ చేస్తాం.   

మరిన్ని వార్తలు