మహిళ ఆత్మహత్య

22 Jul, 2019 09:09 IST|Sakshi
స్వాతి మృతదేహం

బంజారాహిల్స్‌: తాను దుబాయ్‌కి వెళ్తానంటే నిరాకరించాడని మనస్తాపానికిలోనైన ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రి సమీపంలోని జక్కంపేట గ్రామానికి చెందిన చాప స్వాతి(24) హైదరాబాద్‌లోని రహ్మత్‌నగర్‌ వీడియో గల్లీకి చెందిన దోసపాటి గోపి అనే పెయింటర్‌తో రెండేల్లుగా సహజీవనం చేస్తోంది. ఆమెకు గతంలోనే పెళ్లికాగా ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే స్వాతి తన భర్త, కుమారుడిని రాజమండ్రిలోనే వదిలేసి అప్పటికే వివాహమై గోపీతో సహజీవనం చేస్తోంది. మూడు రోజుల క్రితం గోపి మొదటి భార్య భాగ్యమ్మ ఇంటికి వచ్చి తన కుమారుడి స్కూల్‌ ఫీజు కట్టాలని అతడిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో అతను స్వాతితో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు ముగ్గురం కలిసే ఉందామని చెప్పాడు. ఇందుకు స్వాతి  నిరాకరిస్తూ తాను దుబాయ్‌ వెళ్తానని చెప్పగా అందుకు  గోపి అంగీకరించలేదు. దీంతో స్వాతి తన స్వగ్రామానికి వెళ్లి, శనివారం రాత్రి తిరిగి రాగా ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. మళ్లీ ఎందుకు వచ్చావంటూ గోపి నిలదీయడంతో మనస్తాపానికిలోనైన స్వాతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నిద్ర లేచిన గోపి దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. గోపిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ ఎస్‌ఐ శేఖర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు