అత్తమామలు మందలిస్తారని..

26 Jul, 2018 08:19 IST|Sakshi
భర్త శివరామిరెడ్డి, కుమారుడు ధృవన్‌రెడ్డితో మృతురాలు అశ్రిత(ఫైల్‌)

చిన్నశెట్టిపల్లె(రాజుపాళెం) : అత్తమామలు మందలిస్తారనే భయంతో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజుపాళెం మండలం చిన్నశెట్టిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామానికి చెందిన అశ్రిత(26)కు ఆరేళ్ల క్రితం చిన్నశెట్టిపల్లె గ్రామానికి చెందిన మెట్టుపల్లి చిన్నయ్యగారి శివరామిరెడ్డితో వివాహమైంది. వీరికి మూడేళ్ల ధృవన్‌రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఈమె భర్త శివరామిరెడ్డి కర్నూలు జిల్లాలోని ప్రియ సిమెంట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తుండటంతో అక్కడే నివాసముంటున్నారు. ఈనేపథ్యంలో వారం రోజుల క్రితం అతను అశ్రితను తీసుకొచ్చి చిన్నశెట్టిపల్లెలో అతని అమ్మానాన్నల వద్ద వదిలి వెళ్లాడు.

పిల్లవాడు ఎక్కువగా అల్లరి చేస్తున్నాడనే కారణంతో గత సోమవారం ఆమె బాలుడిని మందలించింది. దీంతో తన అత్తమామలు ఏమైనా అంటారేమోననే భయంతో సోమవారం ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి గోపాల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

మరిన్ని వార్తలు