నానమ్మే ఎక్కువ ఇష్ట‌మ‌ని..

10 Jun, 2020 15:56 IST|Sakshi

చండీగఢ్‌: ప్రేమ ప్రాణం పోస్తుందంటారు. కానీ అదే ప్రేమ ప్రాణం తీస్తుంద‌న‌డానికి ఓ ఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. పంజాబ్‌లోని జ‌లంధ‌ర్‌కు చెందిన కుల్వీంద‌ర్ కౌర్ అనే మ‌హిళ‌కు అర‌ష్ ప్రీత్ అనే ఆరేళ్ల కొడుకు‌ ఉన్నాడు. ఆమె భ‌ర్త ఉపాధి నిమిత్తం ఇటలీకి వెళ్ల‌గా.. కొడుకుతో క‌లిసి అత్త‌గారింట్లోనే నివ‌సిస్తోంది. అయితే ఆమెకు అత్త‌కు పొసిగేది కాదు. కానీ ఆమె పంచ‌ప్రాణాలైన కొడుకు మాత్రం త‌న నాన‌మ్మ‌తో బాగా చ‌నువుగా ఉండేవాడు. ఇది కుల్వీంద‌ర్‌కు ఎంత‌మాత్ర‌మూ న‌చ్చేది కాదు. (పైలట్‌ కోసం సిక్కుల ఔదార్యం)

త‌న‌కన్నా నానమ్మ‌పైనే ఎక్కువ‌ ప్రేమ చూపిస్తున్నాడ‌ని ఆమె లోలోప‌లే ర‌గిలిపోయింది. ఈ క్ర‌మంలో అత్తాకోడ‌ళ్ల‌ మ‌ధ్య గొడ‌వ కూడా జ‌రిగింది. దీంతో కుల్వీంద‌ర్ త‌న కొడుకును చంపి తాను చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకుంది. క‌న్నకొడుకును క‌త్తితో పొడిచి అనంత‌రం భ‌వ‌నంలోని రెండో అంత‌స్థు పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. పిల్ల‌వాడి అరుపులు విన్న కుటుంబ స‌భ్యులు వెంట‌నే అత‌డి గ‌దిలోకి వెళ్లి చూడ‌గా ర‌క్త‌పు మ‌డుగులో అత‌డు శ‌వ‌మై క‌నిపించాడు. స‌ద‌రు మ‌హిళ మాత్రం స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది. హ‌త్యానేరం కింద పోలీసులు కుల్వీంద‌ర్ కౌర్‌పై కేసు న‌మోదు చేశారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియాల్సి ఉంది. (కన్న కూతురిని హతమార్చిన తల్లి.. ఆపై)

మరిన్ని వార్తలు