మంత్రి కాన్వాయ్‌ ఢీకొందని తప్పుడు పోస్టు

19 Aug, 2019 08:02 IST|Sakshi

సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వారిపై కేసు

సాక్షి, షాద్‌నగర్‌/ రంగారెడ్డి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా తప్పుడు వార్తను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వారిపై షాద్‌నగర్‌ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్సై విజయభాస్కర్‌ కథనం ప్రకారం.. సర్దార్‌సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణానికి వచ్చారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న పాపన్నగౌడ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి కిషన్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లారు.

అయితే, మంత్రి కాన్వాయిలోని వాహనం ఓ చిన్నారిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉందని షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ఖాజాపాషా అనే విలేకరి ఉద్దేశపూర్వకంగా మంత్రి పటిష్టకు భంగం కల్పించే విధంగా వివిధ సామాజిక మాద్యమాల్లో తప్పుడు వార్తను పోస్టు చేశాడు. ఈమేరకు టీఆర్‌ఎస్‌ కార్య కర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని, ఘర్షణ వాతావరణం నెలకొల్పే విధం గా చేసిన ఖాజాపాషాపై చర్యలు తీసుకోవాలని కిషన్‌నగర్‌ గ్రామానికి చెందిన అంజయ్యగౌడ్‌ ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయ్‌భాస్కర్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు