Pallavi Prashanth: 'ఏడుద్దామంటే భయంగా ఉంది.. నేను కూడా మనిషినే కదా అన్నా'

19 Dec, 2023 21:22 IST|Sakshi

ఈ ఏడాది జరిగిన రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ విన్నర్‌గా నిలిచారు. విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్‌కు అతని అభిమానులు ఘనస్వాగతం పలికారు. అదేక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తరలివచ్చిన కొందరు ఫ్యాన్స్ శృతిమించి అత్యుత్సాహం ప్రదర్శించారు. కొందరైతే ఏకంగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ అయిన అమర్‌దీప్‌, అశ్విని, మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్‌పై కార్లపై దాడికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఆర్టీసీ బస్సుల అద్దాలు సైతం ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని అభిమానులపై కేసులు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా ట్రోఫీ గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ తన సొంత ఊర్లో అడుగుపెట్టారు. బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలిచిన ప్రశాంత్‌కు ఘనస్వాగతం లభించింది. కారులో ర్యాలీగా వెళ్లిన ప్రశాంత్.. అభిమానులకు అభివాదం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఫ్యాన్స్ రియాక్షన్‌పై పల్లవి ప్రశాంత్ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ..'అన్న నేను మళ్లా వచ్చినా. నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ బాధపడే రోజు. రైతుబిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికింది. అన్నా.. మీడియా మిత్రులు మీరే చూసిర్రు. ఇంతమంది ప్రజలు నాకోసం వచ్చిర్రా అన్న సంతోషంలో ఉన్నా. కానీ ఆ సంతోషం లేకుండా చేయాలని మీరు అనుకుంటుర్రు. నిజంగా బాధగా ఉంది. ఏడుద్దామంటే నీరు నెగెటివ్ చేస్తారేమోనని భయంగా ఉంది. ఎందుకు 60 నుంచి 70 యూట్యూబ్ ఛానెళ్లు వచ్చిర్రు. నా కోసం వచ్చిన వారందరికీ ఫోటోలు, వీడియోలు ఇచ్చినా.  నేను అన్నం కూడా తినలే. అయినా కొంతమంది మీడియా మిత్రులు వచ్చి.. అన్నా 5 నిమిషాలు ఇవ్వు, 10 నిమిషాలు ఇవ్వు అంటూ వెంటపడ్డారు. నేను కూడా మనిషినే కదా అన్నా. నా వల్ల అయితలేదు అని చెప్పినా వినరా అన్నా' అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చాక చాలామంది ప్రశాంత్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు యత్నించారు.

>
మరిన్ని వార్తలు