-

మైనర్‌ బాలికతో ప్రేమ.. టవరెక్కిన యువకుడు

26 Jun, 2018 13:53 IST|Sakshi
సెల్‌టవరెక్కిన యువకుడు, ఇన్‌సెట్లో ప్రేమికులు

సాక్షి, నల్గొండ : తమ ప్రేమను బతికంచండంటూ ఓ యువకుడు సూసైడ్‌ నోట్‌ రాసి సెల్‌ టవర్‌ ఎక్కిన ఘటన నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది. కొండమల్లేపల్లికి గ్రామానికి చెందిన ఓ యువకుడు మంగళవారం ఉదయం సెల్‌టవర్‌ ఎక్కాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బంధించారని, ఆమెతో మాట్లాడిస్తేనే కిందకు దిగుతానని లేదంటే దూకుతానని హెచ్చరిస్తున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది యువకుడికి నచ్చజెప్పి కిందికి దింపే ప్రయత్నం చేస్తున్నారు.

మా అమ్మాయి మైనర్‌
ఆ యువకుడిపై అమ్మాయి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్‌ అయిన తమ కుమార్తెను ఆ యువకుడు ప్రలోభాలకు గురి చేశాడని వారు మండిపడ్డారు. తమ కూతురికి మైనారిటీ తీరలేదని, అందుకే ఇప్పుడు పెళ్లి చేయలేమని ఆమె తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. తమ కూతురుని బంధించలేదని, మైనారిటీ తీరకుండా వివాహం ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. 

సూసైడ్‌నోట్‌..
సెల్‌టవర్‌ ఎక్కిన ఆ యువకుడు రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో.. గత నాలుగు సంవత్సరాలుగా తాము ప్రేమించుకుంటున్నామని, ప్రేమ విషయం తెలిసి తనపై ఆమె తల్లిదండ్రులు అక్రమ కేసులు పెట్టించారని ఆ యువకుడు పేర్కొన్నాడు. ఇద్దరివి వేరువేరు కులాలు కావడంతోనే తమ ప్రేమను అడ్డుకుంటున్నారని ఆరోపించాడు.  గతంలో తమను కొట్టారని.. అప్పుడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టామని నోట్‌లో తెలిపాడు. పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారని, ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను బంధించి చిత్రవదలకు గురిచేస్తున్నారని తన లేఖలో వివరించాడు. 
 

మరిన్ని వార్తలు