ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

22 Nov, 2018 13:20 IST|Sakshi
జీవన్‌కుమార్‌ మృతదేహం

ప్రకాశం, మేదరమెట్ల: కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రోత్‌ సెంటర్‌లో శ్రీకాకుళానికి చెందిన యువకుడు ఉరేసుకొని బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం సింగన్నపాలెం గ్రామానికి చెందిన జీవన్‌కుమార్‌ (25) అనే యువకుడు కొంతకాలం నుంచి గ్రోత్‌ సెంటర్‌లో గ్రానైట్‌ పాలిష్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సెలవు పెట్టి స్వగ్రామానికి వెళ్లి వచ్చాడు. నాలుగు రోజుల నుంచి అనారోగ్యంగా ఉండటంతో పనికి కూడా వెళ్లడం లేదు.

తోటి స్నేహితులతో కలిసి ఊరికి వెళ్తున్నానని చెప్పిన జీవన్‌కుమార్‌ గది లోపల గడియ పెట్టుకొని దూలానికి  ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పనికి వెళ్లి తిరిగి రూమ్‌కు వచ్చిన సహచరులు లోపల గడియ పెట్టి ఉండటాన్ని గమనించి కిటికీ నుంచి లోపలకు చూడగా జీవన్‌కుమార్‌ ఉరేసుకొని కనిపించడంతో మేదరమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మేదరమెట్ల ఎస్‌ఐ వై.పాండురంగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీవన్‌కుమార్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు