వైఎస్సార్‌సీపీ నేత రమేష్‌రెడ్డిపై హత్యాయత్నం

13 Apr, 2018 08:55 IST|Sakshi

అర్ధరాత్రి మూడో అంతస్తులోని కారిడార్‌లోకి చొరబడ్డ అగంతకుడు

ప్రాణరక్షణ కోసం కాల్పులు జరిపిన రమేష్‌రెడ్డి

అగంతకునికి మతిస్థిమితం లేదంటున్న పోలీసులు

పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకుల మండిపాటు

తాడిపత్రిలో ఉద్రిక్తత

తాడిపత్రి : ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు హత్యా రాజకీయాలకు తెర లేపుతున్నారు. తమకు అడ్డుగా ఉన్నవారిని అంతమొందించేందుకు కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగానే తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్‌రెడ్డిపై బుధవారం అర్ధరాత్రి ఓ అగంతకుడు హత్యాయత్నం చేశాడు. రమేష్‌రెడ్డి తన ప్రాణాలను కాపాడుకునేందుకు తన లైసెన్స్‌ పిస్టల్‌తో ఆ అగంతకునిపై కాల్పులు జరిపారు. అయితే పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆగంతకుడికి మతిస్థిమితం లేదంటూ, రమేష్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే... రమేష్‌రెడ్డి క్రిష్ణాపురం ఐదవ రోడ్డులోని తన నివాసంలో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో కారిడార్‌లోకి తలారి బాలచంద్ర అనే అగంతకుడు చొరబడ్డాడు. మూడో అంతస్థులో రమేష్‌రెడ్డి నిద్రిస్తున్న గది కిటికీ తలుపును తెరిచేందుకు ప్రయత్నించాడు. అలికిడి కావడంతో ఆయనకు మెలకువ వచ్చి లైసెన్స్‌ రివాల్వర్‌ తీసుకుని బయటకు వచ్చాడు. అగంతకుడు హత్యాయత్నం చేయడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాడు. బుల్లెట్‌ గోడకు తగిలి కాలిలోకి చొచ్చుకుపోవడంతో అగంతకుడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఇంతలో రమేష్‌రెడ్డి గన్‌మెన్‌ కింద ఫ్లోర్‌లో నుంచి మూడో అంతస్తులోకి చేరుకున్నాడు. రమేష్‌రెడ్డి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు.

వెంటనే పట్టణ సీఐ సురేందర్‌రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అగంతకుడు బాలచంద్రను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతని ఎడమ కాలి పాదంలో ఉన్న బుల్లెట్‌ను తొలగించారు. పోలీసులు అగంతుకుడిని అదుపులోకి తీసుకుని విచారించకుండా కేసు నమోదు చేసుకుని మతిస్థిమితం లేని వ్యక్తి అని చెప్పి వదిలిపెట్టేశారు. కాల్పులు జరిపినందుకు రమేష్‌రెడ్డిపై కేసు నమోదు చేసి నోటీసులు అందజేశారు. ఆయన లైసెన్స్‌ పిస్టల్‌ను స్వాధీ నం చేసుకున్నారు.

రాజకీయ ఒత్తిడితో కేసును తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు ఆ అగంతకుడికి మతిస్థిమితం లేదని ధృవీకరించారని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో మూడో అంతస్తులోకి చొరబడ్డ వ్యక్తిని విచారించకుండా మతిస్థిమితం లేనివాడని పోలీసులే నిర్ధారించి ఇంటికి పంపడమే దీనికి నిదర్శమని చెప్పారు. రమేష్‌రెడ్డిపై హత్యాయత్నంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు