ఈ నెల 6న ఢిల్లీలో ప్రవాసీ ప్రజావాణి

2 Sep, 2017 16:13 IST|Sakshi
► ప్రతి నెల మొదటి బుధవారం ఓపెన్‌ హౌజ్‌
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: విదేశాంగ శాఖ ప్రవాసీల కోసం ప్రతినెలా ప్రవాసీ ప్రజావాణి (బహిరంగ వేదిక)ను నిర్వహించనున్నట్లు తెలంగాణ గల్ఫ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు నంగి దేవేందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొటెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎమిగ్రెంట్స్‌(పిజిఇ) కార్యాలయంలో ప్రతినెలా మొదటి బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనుందని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం 18 ఇసిఆర్‌ దేశాలకు వలస వెల్లదలచిన వారు, ఆయా దేశాల నుంచి తిరిగి వచ్చినవారు తమ సమస్యలను, సందేహాలను వినడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ పిజిఇ కార్యాలయం ఢిల్లీలో చాణక్యపురి, అక్బర్‌ భవన్‌లో గల ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న వారు పిజిఇ కార్యాలయం ఫోన్‌ నెం. 011 24673965కు గానీ, ఈ–మెయిల్‌: pge@mea.gov.in కు సంప్రదించవచ్చని తెలిపారు. సలహాలు, సహాయం కోసం తెలంగాణ గల్ఫ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ హెల్ఫ్‌లైన్‌ నెంబర్‌ 81435 88886 కు కాల్‌ చేయాలని కోరారు. హైదరాబాద్‌ వంటి నగరాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గల్ఫ్‌ కోఆపరేటివ్‌ కౌన్సిల్‌ (జీసీసీ) సభ్యదేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, ఓమాన్, ఖతార్‌తో పాటు ఆప్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, నార్త్‌ సుడాన్, సౌత్‌సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్‌ ఇలా మొత్తం 18 దేశాలను భారత ప్రభుత్వం విదేశాలకు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి అవసరం’ అయిన దేశాలు (ఇ.సి.ఆర్‌– ఎమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ రిక్వయిర్డ్‌)గా వర్గీకరించిందని వివరించారు. ఈ దేశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారు సుమారు పది లక్షల చొప్పున ఉన్నారని అంచనా.