లండన్: లండన్ నగరంలోని హౌంస్లోలో ప్రాంతంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు జరిగాయి. హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జనోత్సవం నిర్వహించారు. లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. థేమ్స్ నది దాకా సాగిన నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్ వాసులు పాల్గొని, ఆట పాటలతో సంబరాలు చేశారు.
హైదరాబాద్ నగరవాసుల మాదిరిగానే వివిధ ప్రాంతాల, మతాల ప్రజలు లండన్లో కూడా ఐకమత్యంగా ఉండి ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని ఈ సందర్భంగా పలువురు ముఖ్యులు అన్నారు. వినాయకుని చేతిలో ఉంచిన లడ్డూను విక్రమ్ రెడ్డి రేకుల - సుమా దేవి దంపతులు 701 పౌండ్లకు వేలంలో దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణా అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డం (టాక్ ) వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షురాలు శ్రీమతి పవిత్ర రెడ్డి కంది దంపతులు ఇతర సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అధ్యక్షుడు అశోక్ దూసరి ముఖ్య నిర్వాహకులు నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, మల్లా రెడ్డి, సతీష్ గొట్టిముక్కుల, సత్యపాల్ పింగిళి, సత్య చిలుముల, వేణు రెడ్డి, సత్యం రెడ్డి కంది, శ్రీకాంత్ జిల్లా, వెంకీ, రాజేష్ వాకా, నగేష్, రాకేష్, రవి కిరణ్, వంశీ ,శ్రీనివాస్ మేకల, గణేష్ పాస్తం, రవి రత్తినేని, సుమ, శైలజ , శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.