– కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్
కర్నూలు(అర్బన్): అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 12న అన్ని మండల కేంద్రాల్లో 3కే రన్, జిల్లా కేంద్రంలో 13న 5కే రన్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ డీఎస్డీఓ మల్లికార్జునుడుని ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో ఈనెల 14న 125వ అంబేద్కర్ జయంతి ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే యువతీ యువకులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేయాలన్నారు. నగరంలో 13వ తేదీ కలెక్టరేట్ నుండి కొండారెడ్డి ఫోర్ట్ వరకు 5కే రన్ నిర్వహించాలన్నారు. నర్సింగ్, మెడికల్ కళాశాల విద్యార్థులు రన్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అంబేద్కర్ సర్కిల్లో డయాస్ ఏర్పాటు, పూలమాల అలంకరణ తదితర ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబును ఆదేశించారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో భాగస్వాములైన వాళ్లందరికీ సర్టిఫికెట్స్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, మెప్మా పీడీ రామాంజనేయులు, మైనార్టీ సంక్షేమాధికారి మస్తాన్ వలి, సాంఘిక సంక్షేమాధికారి తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు.