ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు

4 Jan, 2016 19:36 IST|Sakshi

కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో..
 
 సాక్షి నెట్‌వర్క్: కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాలపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కరీంనగర్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు రావడంతో రికార్డు అసిస్టెంట్ రామమూర్తి పరారీకాగా, అతని కౌంటర్‌లో రూ. 4 వేలు అదనంగా లభించాయి. అలాగే, ఓ ఏజెంట్ వద్ద రూ. 25 వేలు, మరో ఏజెంట్‌వద్ద రూ. 13 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం కార్యాల యంపై దాడి చేసి అక్కడున్న 9 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.13 లక్షల నగదు ను, వాహనదారుల దరఖాస్తులను స్వాధీనపరుచుకున్నా రు. కార్యాలయంలోని ఓ ఉద్యోగి వద్ద ఉండాల్సిన దాని కన్నా రూ. 995 తక్కువగా ఉండడంతో వాటినీ స్వాధీనం చేసుకున్నారు. ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ ఉప రవాణా కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసే సమయంలో 28 మంది ఏజెంట్లు కార్యాలయంలో ఉండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.50,910 స్వాధీనం చేసుకున్నారు.

 హైదరాబాద్‌లో పట్టుపడిన ఉద్యోగి
 కొత్త వాహనాలకు అనుమతినిచ్చే విషయంలో  లంచం తీసుకుంటూ హైదరాబాద్ రవాణా కమిషనర్ కార్యాలయానికి చెందిన ఒక ఉద్యోగి సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఖైరతాబాద్‌లోని తెలంగాణ రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పని చేస్తున్న ఎ.నరేందర్ పంజాబ్‌కు చెందిన కెఎస్ ఆగ్రోటెక్ సంస్థకు చెందిన హార్వర్డ్ న్యూ మాన్యుఫ్యాక్చర్ వాహనానికి తెలంగాణలో అనుమతినిచ్చేందుకు సదరు సంస్థకు చెందిన ఏరియా మేనేజర్ వెంకటేశ్ వద్ద నుంచి డబ్బులు  డిమాండ్ చేశాడు.  నిబంధనల మేరకు కొత్త వాహనాల అనుమతి కోసం రూ.5,000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారంరోజుల్లో అనుమతినివ్వాల్సి ఉం టుంది. ఈ క్రమంలో రూ.8 వేలు ఇచ్చేందుకు వెంకటేశ్ అంగీకరించాడు. నరేందర్ సూచన మేరకు ఆ  డబ్బులు తమ జూనియర్ అసిస్టెంట్ మురళికి ఇస్తుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు