పిండ ప్రదానం.. వస్తువులు మాయం

21 Aug, 2016 01:12 IST|Sakshi
పిండ ప్రదానం.. వస్తువులు మాయం
– దోపిడీకి గురవుతున్న పిండ ప్రదాన కత్రువు భక్తులు
– అరకొరగా వస్తువుల అందజేత
– పూర్తి స్థాయి సామగ్రి కోసం అదనంగా చెల్లింపు
 
 శ్రీశైలం (జూపాడుబంగ్లా): తరతరాల కుటుంబ బాంధవ్యాలకు ప్రతీకమైన పిండ ప్రదానానికి పుష్కరాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. తమను వీడి పోయిన ఆత్మీయులకు 12 సంవత్సరాలకోసారి వచ్చే పుష్కరాల్లో భక్తిశ్రద్ధలతో పిండ ప్రదానం చేస్తారు. ఈ రోజుల్లో పితదేవతలు నదుల్లో ఉంటారనే విశ్వాసం ఉంది. భక్తుల నమ్మకాన్ని కొందరు దోచుకుంటున్నారు. పుష్కరాల్లో తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేసే వస్తువులు సరిగా లేకుండానే చేయాల్సి వస్తోంది. పిండప్రదాన కార్యక్రమం నిర్వహించేందుకు పసుపు, కుంకుమ, వక్కలు, బెల్లం, నెయ్యి ఐదు గ్రాములు, మూడు అగరవత్తులు, 30గ్రాముల నల్లనువ్వులు, పావుకిలో వరిపిండి, గంధం 10 గ్రాములు, కర్పూరం నాలుగు బిళ్లలు, తమలపాకులు 10, విస్తరాకులు 4, అరటిపండ్లు 12 అవసరం ఈ సామగ్రిని పొదుపులక్ష్మి మహిళలు రూ.50 విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. అందులో పిండప్రదాన క్రతువుకు అవసరమైన అన్నిరకాల వస్తువులు లేకపోవటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిట్లులోలేని వస్తువులు కావాలంటే అదనంగా పొదుపు మహిళలు మొత్తాన్ని వసూళ్లు చేస్తున్నట్లు భక్తులు పేర్కొంటున్నారు. డబ్బులు చెల్లించలేని భక్తులు పొదుపు మహిళలు ఇచ్చిన కిట్టులో ఉన్న వస్తువులతోనే పిండప్రదానాన్ని మమ అనిపిస్తున్నారు. పిండ ప్రదానం వస్తువులపై అవగాహన ఉన్న భక్తులు దబాయిస్తుండటంతో మిగిలిన వస్తువులను ఇస్తున్నారు. 
రోజుకు రూ.2.25లక్షల అమ్మకాలు:
పిండప్రదానికి అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను దేవస్థానం వారు 30 మంది పొదుపు మహిళల ద్వారా విక్రయిస్తున్నారు. ఒక్కో కిట్టు రూ.50 చొప్పున రోజుకు ఒక్కో పొదుపు మహిళ కనీసం 150 కిట్లను విక్రయిస్తున్నారు. ఈలెక్కన రోజుకు రూ.2.25లక్షల అమ్మకాలు జరుగుతున్నాయి. లింగాలగట్టు దిగువ పుష్కరఘాటులో రోజుకు కనీసం 4,500 మంది భక్తులు పిండప్రదానాలు చేస్తున్నారు. పిండప్రదానం చేసే ఒక్కోభక్తుని నుంచి పూజారులు నిర్ణీత ధర రూ.300ల చొప్పున వసూళ్లు చేస్తున్నారు. దీంతో రోజుకు రూ.13.50 లక్షల మేర పిండప్రదానాల ద్వారా బ్రాహ్మణులకు ఆదాయం సమకూరుతుంది.    
 
మరిన్ని వార్తలు