మున్సిపల్‌ స్కూల్స్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫౌండేషన్‌ కోర్సు

10 Jan, 2017 00:05 IST|Sakshi
- వచ్చే ఏడాది 13 జిల్లాల్లో ఐఐటీ, ఒలింపియాడ్‌ స్కూళ్లు
- రూ.100 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు
-  రాష్ట్ర కో ఆర్డినేటర్‌ రావుల రవీంద్ర
 
కర్నూలు(టౌన్‌): ‘రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది అన్ని మున్సిపాలిటీల పరిధిలో కెరీర్‌ ఫౌండేషన్‌ కోర్సులు ప్రారంభించాం. మంచి ఫలితాలు రావడంతో ఇక అడ్వాన్స్‌డ్‌ ఫౌండేషన్‌ కోర్సులను ప్రారంభించేందుకు నిర్ణయించాం’ అని ఫౌండేషన్‌ కోర్సు రాష్ట్ర కోఆర్డినేటర్‌ రావుల రవీంద్ర తెలిపారు. స్థానిక నగరపాలకలోని సమావేశ భవనంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ పాఠశాలల్లో  కెరీర్‌ ఫౌండేషన్‌ కోర్సు తీసుకొచ్చి మెరుగైన ఫలితాలు సాధించామని రవీంద్ర తెలిపారు. ఈ ఏడాది ఎంపిక చేసిన 59  పాఠశాలల్లో అడ్వాన్స్‌డ్‌ ఫౌండేషన్‌ కోర్సు అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. 
 
కామన్‌ సిస్టమ్‌..
6,7,8,9,10 తరగతుల్లో ఒకే పాఠ్యాంశం, కామన్‌ షెడ్యూల్, కామన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తున్నట్లు రవీంద్ర తెలిపారు. కెరీర్‌ కోర్సు ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే రాష్ట్రంలోని 263 మున్సిపల్‌ పాఠశాలల్లో 36వేల మంది విద్యార్థులు శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి13 జిల్లాల్లో ఐఐటీ ఒలింపియాడ్‌ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత, మండల స్థాయి పాఠశాలల్లోనూ వీటిని ప్రారంభిస్తామన్నారు.  ఇందుకోసం ప్రభుత్వం రూ.100 కోట్లు  కేటాయించిందన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌ రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్‌ రామలింగేశ్వర్‌ పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు