మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దహనం

22 Mar, 2017 00:07 IST|Sakshi

కదిరి : కదిరిలో నారాయణ స్కూల్‌ ఎదుట మంగళవారం ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులు మున్సిపల్‌ శాఖామంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనను తక్షణం మంత్రి పదవి నుండి తప్పించాలని డిమాండ్‌ చేశారు. నారాయణ స్కూల్‌ యాజమాన్యం సోమవారం 10వ తరగతి హిందీ ప్రశ్నాపత్రం బయటకు తీసుకొచ్చి ప్రశ్నలన్నింటికీ కాపీలు సిద్ధం చేసి పరీక్షా కేంద్రాలకు పంపిన  విషయం తెలిసిందే. అధికార పార్టీని అడ్డంపెట్టుకొని ప్రతిరోజూ నారాయణ స్కూల్‌ నిర్వాహకులు 10వ తరగతి ప్రశ్నాపత్రాలు బయటకు తీసుకొచ్చి ఇతర ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివి పరీక్ష రాస్తున్న మెరిట్‌ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ఇంత జరుగుతున్నా దీనిపై ఉన్నతాధికారులు ఎందుకు విచారణకు ఆదేశించలేదని మండిపడ్డారు. మంత్రి నారాయణను తక్షణం పదవి నుండి తప్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలను చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యులు రాజేంద్ర, కదిరి డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌కుమార్, రాజేష్, పట్టణాధ్యక్షులు ఆసీఫ్, అంజాద్, కరీం, గణేష్, చెన్న, ప్రదీప్, అంజి, హరీష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు