రేపటి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్లు

8 Jun, 2016 19:50 IST|Sakshi

కాకినాడ: ఇంజినీరింగ్ కళాశాలలో 2016-17 సంవత్సర ప్రవేశాలకు సంబంధించి వెబ్ అప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,79,465 మంది హాజరు కాగా, వీరిలో లక్షా 31 వేల 580 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.

ఎంసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు రాష్ర్టంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల్లో ఎక్కడైనా అభ్యర్థులు హాజరై తమ విద్యార్హత ధ్రువపత్రాలు పరిశీలనతోపాటు వెబ్ అప్షన్ల నమోదులో పాల్గొనవచ్చన్నారు. ఆప్షన్లు మార్పు, చేర్పులు ఈ నెల 19,20 తేదీల్లో చేసుకోవచ్చని, సీట్ల కేటాయింపు 22న చేస్తారన్నారు.

పాస్‌వర్డ్‌ను గోప్యంగా ఉంచాలి...
ప్రభుత్వ హెల్ప్‌లైన్ సెంటర్‌లో అధికారుల పర్యవేక్షణలో వెబ్ అప్షన్లు నమోదు చేసుకోవాలని, నెట్‌కేఫ్‌లలో చేస్తే దళారులు మనకు తెలియకుండానే మోసపుచ్చి ఆప్షన్లను మార్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఎంసెట్ విద్యార్థులకు ఇచ్చే వన్‌టైం పాస్‌వర్డ్ ఎవ్వరికీ తెలియకూడదని, ఈ పాస్‌వర్డ్ చాలా కీలకమని చెప్పారు. విద్యార్థులకు ర్యాంక్ ఆధారంగా కేటాయించిన తేదీల్లో విద్యార్థి హాజరుకాలేకపోయినా తరువాత రోజు హాజరుకావచ్చన్నారు. ఎన్ని అప్షన్లు ఎక్కువగా ఇస్తే అంత మంచిదని, ఆసక్తిలేని కళాశాల పేర్లను అప్షన్లుగా ఇవ్వకూడదన్నారు.

>
మరిన్ని వార్తలు