అత్తపై కోడలి హత్యాయత్నం

10 Sep, 2016 23:54 IST|Sakshi
  • వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..
  • నిజామాబాద్‌ రూరల్‌ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని అత్తనే హత్య చేయాలని చూసిందో కోడలు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖానాపూర్‌కు చెందిన సుమన్‌ బతుకు దెరువు కోసం దుబాయికి వెళ్లాడు. అతడి భార్య మంజుల ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని అత్త బాగవ్వ దుబాయిలో ఉన్న తన కుమారుడు సుమన్‌కు ఫోన్‌ ద్వారా తెలిపింది. దీంతో కక్ష పెంచుకున్న మంజుల.. అత్త అడ్డు తొలగించుకోవడానికి కుట్ర పన్నింది. శుక్రవారం రాత్రి సేమియాలో విషం కలిపి అత్తకు ఇచ్చింది. అయితే సేమియా చేదుగా అనిపించడంతో భాగవ్వ దానిని తినలేదు. 
    మంజుల పథకం ప్రకారం భాగవ్వ తల్లి గంగవ్వను ఇంట్లో నుంచి మరో బంధువు సాగరవ్వ ఇంటికి పంపించింది. రాత్రి నిద్రపోతున్న సమయంలో భాగవ్వ గొంతుకోసి చంపేందుకు యత్నించింది. భాగవ్వ కేకలు వేయడంతో మంజుల పారిపోయింది. ఈ దాడిలో భాగవ్వ మెడకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని వారు భాగవ్వను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని నిజామాబాద్‌ రూరల్‌ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఆమె వాంగ్మూలాన్ని స్వీకరించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. 
మరిన్ని వార్తలు