గిరిజనులు సహకరిస్తే ఉపాధికి భరోసా

27 Jul, 2016 00:23 IST|Sakshi



గూడెంకొత్తవీధి: మన్యంలో ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటల్లో సాగు చేసేందుకు గిరిజనులంతా సహకరిస్తే ఏడాది పొడవునా ఉపాధి కల్పించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ఏపీఎఫ్‌డీసీ డీఎం భరత్‌కుమార్‌ తెలిపారు. జీకే వీధి, చింతపల్లి మండలాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. సంస్థకు చెందిన కాఫీ తోటలను ఆయన పరిశీలించారు. సిరిబాల, అంటిచెట్ల వీధి, ఎర్రవరం, రామగెడ్డ, జీవనలంక గ్రామస్తులతో మాట్లాడారు. అడవుల సంరక్షణతో పాటు కాఫీ తోటల ద్వారా గిరిజనులు ఆర్థికంగా అభివద్ధి చెందాలనే ఉద్దేశంతో దశాబ్దాల క్రితమే మన్యంలో ఏపీఎఫ్‌డీసీ కాఫీ సాగుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. సంస్థను నమ్ముకొని ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 6 వేల మంది ఉపాధి పొందుతుండేవారన్నారు.
మన్యంలో ప్రతికూల పరిస్థితులతో తోటలు వథా
మన్యంలో కొంతకాలంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల సంస్థ ఆధీనంలో ఉన్న కాఫీ తోటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. దీని వల్ల మంచి ఫలసాయం ఇచ్చే కాఫీ తోటలు వథాగా మారుతున్నాయన్నారు. దీంతో నిర్వహణ పనులు లేక స్థానికంగా ఉన్న గిరిజనులు పరోక్షంగా ఉపాధి కోల్పోయారన్నారు. కాఫీ తోటలను సంరక్షించుకోవాలన్న తపన తమ సంస్థ అధికారులకు ఉన్నా మన్యంలో నెలకొన్న ఇబ్బందుల వల్ల తాము ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో గిరిజనులు తమకు ఉపాధి కల్పించాలని తమ సంస్థను కొద్ది రోజులుగా కోరుతున్నారన్నారు. వారి కోరిక మేరకు తాము మన్యంలో కాఫీ తోటల సంరక్షణ ద్వారా ఉపాధి కల్పించాలని భావిస్తున్నామన్నారు. గిరిజనులంతా తమకు సహకరిస్తే వారి ఉపాధికి భరోసా కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.ఈ పర్యటనలో ఆర్వీ నగర్‌ డీఎం ధన్‌రాజ్, రేంజి అధికారులు సత్యనారాయణ, పడాల్‌ పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు