– అక్రమసంబంధం నేపథ్యంలో హతమార్చిన ప్రత్యర్థులు
ఉరవకొండ : వివాహేతర సంబంధం ఆ యువకుడి ప్రాణాలు తీసింది. పద్ధతి మార్చుకోవాలని మందలించినా వినకపోవడంతో ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. ఉరవకొండ ఎస్ఐ నగేష్బాబు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
విడపనకల్లు మండలం చీకులగురికి గ్రామానికి చెందిన ఆదెప్ప, మరిగంగమ్మ దంపతుల కుమారుడు కె.విజయ్(23) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం ఉరవకొండ మండల పరిధిలోని నెరిమెట్ల గ్రామంలో ఉన్న తన అవ్వ వద్ద ఉంటూ ఆటో బాడుగలకు వెళ్లేవాడు. ఈక్రమంలో మండల పరిధిలోని షేక్షానుపల్లి నుంచి నిత్యం కూలీలను నెరిమెట్లకు తీసుకొచ్చి మిర్చి పంట తొలగించిన అనంతరం తిరిగి తన ఆటోలోనే షేక్షానుపల్లికి తీసుకెళ్లేవాడు. రాత్రిళ్లు షేక్షానుపల్లిలోనే బస చేసేవాడు.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఒక మహిళతో విజయ్ అక్రమ సంబంధం ఏర్పడింది. పద్ధతి మార్చుకోవాలంటూ ఆ మహిళ కుటుంబీకులు పలుమార్లు హెచ్చరించినా విజయ్ వినలేదు. దీంతో బుధవారం అర్ధరాత్రి కట్టెలు, రాడ్లతో కొందరు విజయ్ను చితకబాది తన ఆటోలోనే వదిలి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే విజయ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దాడి చేసిన వారిలో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.