► విద్యార్థులకు అమెరికా అటార్నీలా జనీతా సూచన
పెద్దపల్లిరూరల్: అమెరికా లాంటి అగ్రదేశాలలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు అక్కడి పరిస్థితులపై కనీస అవగాహన కలిగి ఉండాలని యూఎస్ఎ లా అటార్నీ జనీతారెడ్డి సూచించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూఎస్ఎ (టిడిఎఫ్) అధ్యక్షుడు కల్వల విశ్వేశ్వర్రెడ్డితో కలిసి శుక్రవారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చే విద్యార్థులు అక్కడి యూనివర్సిటీలకు సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్లలో తెలుసుకోవాలని సూచించారు. చాలామంది వీసా రాగానే ప్రక్రియ పూర్తయిందన్న భ్రమతో వచ్చి ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలు ఎదురైన వారు అక్కడి తమ లా కార్యాలయంలో సంప్రదిస్తే సాయపడతామన్నారు. యూనివర్సిటీలు నిర్వహించే ఓరియంటేషన్ క్లాసులకు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.