ఏలూరు సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి సామర్థ్యాలు ఆశించినస్థాయిలో లేవని నివేదికలు తెలియజేయటంతో పాఠశాలల్లో బేస్మెంట్ పరీక్షల ద్వారా సామర్థ్యాలను అంచనా వేసేందుకు నిర్ణయించినట్టు డీఈవో డి.మధుసూదనరావు సోమవారం తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు బేస్మెంట్ పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహించాలని తెలిపారు. 17న తెలుగు, గణితం, 18న ఇంగ్లిష్ పరీక్షలను, ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు నిర్వహించాలన్నారు. సోమవారం సాయంత్రం సంబంధిత మండల విద్యాధికారుల మెయిల్స్కు పరీక్ష పేపర్లు పొందుపరుస్తామని, పరీక్ష రోజున వాటిని డౌన్లోడ్ చేసి సీఆర్పీల ద్వారా ఆయా పాఠశాలలకు పరీక్షా పత్రాలను పంపాలని ఆదేశించారు. పరీక్షల్లో 50 శాతానికంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 20లోగా ఎంఈవోలకు పంపాలని, వారి నుంచి డీఈవో కార్యాలయానికి 22లోగా అందజేయాలని ఆయన ఆదేశించారు.