భూమా నేత్రాలు దానం

13 Mar, 2017 01:03 IST|Sakshi
భూమా నేత్రాలు దానం
 
నూనెపల్లె: నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందగా ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో నేత్రదానం చేసినట్లు ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్‌ ఎ.విజయ్‌భాస్కర్‌ రెడ్డి తెలిపారు. నేత్రదానం అనంతరం ఆదివారం ఆయన సురక్ష ఆసుపత్రిలో మాట్లాడారు. గతంలో రామకృష్ణా డిగ్రీ కళాశాలలో నేత్రదానం వారోత్సవాల్లో ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పాల్గొని తాను నేత్రాలను దానం చేస్తానని చెప్పారన్నారు. ఈ మేరకు అంగీకార పత్రాలు సమర్పించారన్నారు. ఆ మేరకు ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రవికృష్ణ భూమా కుటుంబ సభ్యులతో ఈ విషయంపై చర్చించి నేత్రదానానికి ఒప్పించారన్నారు. భూమా మృతి తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు నేత్రాలు తీసుకున్నట్లు చెప్పారు. సేకరించిన కళ్లను హైదరాబాద్‌లోని ఎల్‌.వి.ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి పంపుతామన్నారు. నేత్రాలను ఆళ్లగడ్డ, కర్నూలు ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, ఎస్‌.వి.మోహన్‌రెడ్డి, కుమార్తె నాగ మౌనికలు డాక్టర్‌ విజయ భాస్కర్‌రెడ్డికి అందజేశారు.
 
మరిన్ని వార్తలు