సవాల్‌గా మానవ అక్రమ రవాణా

11 Aug, 2016 01:16 IST|Sakshi
సావనీర్ విడుదల చేస్తున్న దృశ్యం
అనంతపురం ఎడ్యుకేషన్‌ :
మానవ అక్రమ రవాణా అరికట్టడం ప్రపంచానికి పెనుసవాల్‌గా మారిందని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఇండోర్‌) రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఎంఆర్‌  శ్రీనాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మానవ అక్రమ రవాణా – సవాళ్లు – ప్రమాణాలు’ అనే అంశంపై ఆర్ట్స్‌ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ కళాశాల డ్రామా హాలులో మూడు రోజుల పాటు  జరిగే జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు సదస్సుకు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌. రంగస్వామి అధ్యక్షత వహించారు.
 
ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్‌ ఎంఆర్‌ శ్రీనాథ్‌ మాట్లాడుతూ ప్రజల నిస్సాహాయతను ఆసరగా చేసుకుని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం మానవ అక్రమ రవాణా 167 దేశాల్లో జరుగుతున్నట్లు తేలిందన్నారు. మన దేశంలో 1.83 కోట్ల మంది అక్రమ రవాణ ఉచ్చులో చిక్కుకున్నారని వీరితో వెట్టిచాకిరి, వ్యభిచారం, యాచకవృత్తి వంటివి చేయిస్తున్నారన్నారు. వీటి నిరోధకానికి విస్త్రతస్థాయిలో అవగాహన కల్పిస్తూ పరిశోధనల ద్వారా పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
 
అనంతరం  ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జి.రామిరెడ్డి , సత్యసాయి యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఆర్‌. గంగాధరశాస్త్రి , మైఛాయిస్‌ ఫౌండేషన్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ వీవీఎన్‌ ఇషాక్, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రంగస్వామిలు మాట్లాడారు. సదస్సు ముఖ్య ఉద్దేశాన్ని కన్వీనర్‌  డాక్టర్‌ ఏసీఆర్‌ దివాకర్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ కార్యదర్శి డాక్టర్‌ టి. శ్యామ్‌ప్రసాద్, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పద్మశ్రీ, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు హరిశ్చంద్రప్రసాద్, కె. ఈశ్వర్‌రెడ్డి, ఎ. శేషారెడ్డి, చౌడప్ప పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు