మృత్యు పంజా | Sakshi
Sakshi News home page

మృత్యు పంజా

Published Thu, Aug 11 2016 12:48 AM

మృత్యు పంజా - Sakshi

జిల్లాలో బుధవారం మృత్యువు పంజా విసిరింది. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఓ వ్యక్తి కాలువలో గల్లంతయ్యాడు. బాధిత కుటుంబాలు తీవ్రంగా రోదిస్తున్నాయి.
లారీ ఢీకొని వృద్ధుడి మృతి 
ఉంగుటూరు : ఉంగుటూరులో లారీ ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన బలమూడి కృష్ణ(60) బుధవారం జాతీయరహదారి దాటుతుండగా, సింగరాజుపాలెం నుంచి నారాయణపురం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కృష్ణ అక్కడికక్కడే మరణించాడు. చేబ్రోలు ఎస్సై చావా సురేష్‌ ఘటనా ప్రదేశానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
ఆగిఉన్న లారీని ఢీకొన్న వ్యాన్‌ : యువకుడి దుర్మరణం
 భీమడోలు  : పూళ్ల వద్ద  జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బుధవారం ఓ మినీ వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాల య్యాడు. మినీవ్యాన్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాల య్యాయి. మరోవ్యక్తి స్పల్పంగా గాయపడ్డాడు.  ఏలూరులోని బావిశెట్టి వారి పేటకు చెందిన జలపరెడ్డి దుర్గా రాంప్రసాద్‌(17), దెంటు సురేష్‌కుమార్‌ ఏలూరులోని ఓ ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌లో కూలీలుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరానికి చెందిన లారీ డ్రైవర్‌ మహేష్‌కు చెందిన మినీ వ్యాన్‌లో ఇంటి సామాన్లు దించేందుకు తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వెళ్లారు. అక్కడ సామాన్లు దించి తిరిగి  ఏలూరు వస్తుండగా.. మార్గమధ్యలో పూళ్ల వద్దకు వచ్చే సరికి మినీ వ్యాన్‌ డ్రైవర్‌ అతివేగాన్ని నియంత్రించలేక డివైడర్‌ను ఢీకొట్టాడు. అదుపుతప్పిన వ్యాన్‌ పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సీటు పక్కనే కూర్చున్న జలపరెడ్డి దుర్గాప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహాం వ్యాన్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి నుజ్జు నుజ్జయింది. వ్యాన్‌ డ్రైవర్‌ మహేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. సురేష్‌కుమార్‌ స్వల్పంగా గాయపడ్డాడు. దుర్గాప్రసాద్‌ మృతదేహాన్ని వ్యాన్‌ నుంచి బయటకు తీసేందుకు పోలీసులు, హైవే సిబ్బంది గంటపాటు శ్రమించారు. దీంతో ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు. ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీసి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం తరలించారు. తీవ్రగాయాలైన డ్రైవర్‌ మహేష్‌నూ ఏలూరు తరలించారు. హెడ్‌కానిస్టేబుల్‌ అమీర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
రైలు నుంచి జారిపడి మరొకరు 
ఏలూరు అర్బన్‌  :  రైలు నుంచి జారి పడి ఓ యువకుడు మరణించాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలు నుంచి ఓ యువకుడు జారి దెందులూరు, ఏలూరు రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై పడి మృతిచెందాడు. ఈ సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుని వయసు 25 ఏళ్లు ఉండవచ్చని, బక్కపలుచని శరీరం కలిగి, 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్నాడని రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ జి.నాగేశ్వరరావు  తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94406 27572 నంబరుకు  సమాచారం తెలపాలని కోరారు.  
 

Advertisement
Advertisement