అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

14 Sep, 2016 00:37 IST|Sakshi
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

జూపాడుబంగ్లా: జూపాడుబంగ్లాలో ఓ వృద్ధురాలు అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ గోవిందు సోదరి పెద్దక్క(68)కు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరందరికి పెళ్లిళ్లు కాగా దివ్యాంగురాలైన కుమార్తెతోపాటు ఆమె విడిగా నివాసం ఉంటున్నారు. గేదెల పోషణతో జీవనోపాధి పొందుతున్న ఆమె నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. మంగళవారం స్థానిక సిద్దేశ్వరం కాలనీకి సమీపంలో ఉన్న ఇసుకవాగులో పెద్దక్క మృతదేహం బయటపడింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో ఓ వ్యక్తికి ఆమె రూ. లక్ష అప్పు ఇవ్వగా.. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆ తర్వాత పెద్దక్క అదృశ్యమైంది. అయితే నాలుగు రోజులు గడిచినా కుటుంబీకులు, బంధువులు ఫిర్యాదు చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మృతురాలి కుమారుడు లక్ష్మన్న తమ తల్లి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుళ్లు డేనియల్‌ రాజు, సంజీవయ్య గ్రామానికి చేరుకుని వద్ధురాలి మృతిపై విచారణ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు