నరసరావుపేట టౌన్ : ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఎస్ఎస్అండ్ఎన్ కళాశాల హాస్టల్ వెనుక ప్రాంతంలో నివాసముంటున్న విద్యార్థిని పట్టణ శివారులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. రోజూ మాదిరిగానే కళాశాలకు వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఆమె చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తరువాత గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కిందికి దించి హుటాహుటిన ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తరలించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.