మండలం కోసం సీఎం వద్దకు..

29 Sep, 2016 20:16 IST|Sakshi
హైదారాబాద్‌లోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద గ్రామస్తులు

హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు

సిద్దిపేట రూరల్‌: నారాయణరావు పేటను మండలం చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సామూహిక రిలే దీక్షలు గురువారం నాటికి 34వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు గ్రామ నాయకులు, మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు హైదారాబాద్‌ వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వినతి పత్రాన్ని క్యాంపు కార్యాలయంలోని భద్రతా సిబ్బందికి అందజేశారు.

అనంతరం గ్రామ సర్పంచ్‌ బందారం రాజమణి రంగాగౌడ్‌, ఎంపీటీసీ మునిగెల కిష్టయ్య, మండల పోరాట సమితి నాయకులు జిల్లెల్ల రమేష్‌గౌడ్‌, ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు నారాయణరావుపేటను మండలం చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. సుమారు 200మంది గ్రామస్తులు మండలం చేయాలని సీఎం కేసీఆర్‌ కార్యాలయం వద్దకు వస్తే.. పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన హామీ మేరకు నారాయణరావుపేటను మండలం చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  అంతకు ముందు సీఎం కార్యాలయం ఎదుట ఉదయం నుంచి కూర్చున్నప్పటికీ సీఎంను కలిసేందుకు పోలీసు సిబ్బంది నిరాకరించి, అక్కడినుంచి పంపించేసిట్లు గ్రామస్తులు తెలిపారు.  కార్యక్రమంలో మండల పోరాట సమితి నాయకులు భాస్కర్‌, గణేష్‌, దేవరాజు, రత్నాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, మహిళ సంఘాల నాయకురాళ్లు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు