అత్యవసర వేళల్లో సత్వరసేవలకు చర్యలు

29 Mar, 2017 22:54 IST|Sakshi
అత్యవసర వేళల్లో సత్వరసేవలకు చర్యలు
-పేదలకు సకాలంలో నాణ్యమైన వైద్యం
-జీజీహెచ్‌ కొత్త సూపరింటెండెంట్‌ రాఘవేంద్రరావు
కాకినాడ వైద్యం :  ప్రాణాపాయస్థితిలో అత్యవసర విభాగంలోకి వచ్చే క్షతగాత్రులు, రోగులకు సత్వర వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు తెలిపారు. బుధవారం ఆయన జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ వై.నాగేశ్వరరావు నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర విభాగంలో ఎమ్మెల్సీ, నాన్‌ ఎమ్మెల్సీ వార్డుల్లో షిఫ్టుకి ప్రస్తుతమున్న ఒక్క సీఎంవోలకు బదులు ఇద్దరు సీఎంవోలను నియమించనున్నట్లు తెలిపారు. జీజీహెచ్‌లో వైద్యసేవలు పొందేందుకు ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా విశాఖజిల్లా సరిహద్దు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు. ఇక్కడకు నూటికి 80 మంది నిరుపేదలే వస్తారని, వీరికి కాలయాపన లేకుండా, సకాలంలో నాణ్యమైన వైద్యసేవలందేలా చర్యలు తీసుకుంటున్నటు తెలిపారు. రోగ నిర్ధారణ పరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు గుర్తించామని, నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహించకపోయినా, సకాలంలో రిపోర్టులు ఇవ్వకపోయినా సిబ్బందిని ఎంత మాత్రం ఉపేక్షించబోమన్నారు. విధి నిర్వహణలో అలసత్వం, సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది, విభాగాధిపతులతో సమన్వయం చేసుకుంటూ ఆసుపత్రి అభివృద్ధి, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా జీజీహెచ్‌లో వైద్యసేవలు అందించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటానన్నారు. పారిశుద్ధ్య సక్రమ నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, పలువురు వైద్య విభాగాధిపతులు, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్, పీజీలు, హౌస్‌ సర్జన్లు డాక్టర్‌ రాఘవేంద్రరావును కలసి, పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
పలు వార్డుల తనిఖీ
సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ రాఘవేంద్రరావు నేరుగా ఈఎన్‌టీ వార్డు, ఆప్తాల్మాలజీ పైన ఏర్పాటు చేసిన స్వైన్‌ప్లూ వార్డును సందర్శించారు. వెంటిలేటర్లు, మాస్క్‌లు, మందులు, పరికరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం అత్యవసర విభాగాన్ని సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడిసిన్, సర్జికల్‌, టీబీ వార్డులను, మాతా,శిశు విభాగంలోని లేబర్‌ రూమ్‌లను సందర్శించారు. చిన్నారుల సంరక్షణపై సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సక్రమ పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు. 
>
మరిన్ని వార్తలు