జీజీహెచ్‌లో ‘వోకల్‌ పెరాలసిస్‌’కు అరుదైన శస్త్రచికిత్స 

28 Oct, 2023 02:55 IST|Sakshi

లబ్బీపేట (విజయవాడ తూర్పు):  వోకల్‌ కార్డు (స్వరతంత్రి) కుడి వైపు పెరాలసిస్‌(పక్షవాతం)కు గురై సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగికి ఈఎన్‌టీ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి మరలా మాట్లాడేలా చేయగలిగారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో నిర్వ­హించిన ఈ శస్త్ర చికిత్స గురించి ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్‌ కొణిదె రవి శుక్రవారం మీడియాకు వివరించారు.

ఒంగోలుకు చెందిన డ్రైవర్‌ అప్పయ్య స్వర సమస్యతో చికిత్స కోసం తమ విభా­గానికి రాగా, అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి వోకల్‌కార్డు కుడివైపు పెరాలసిస్‌ వచ్చినట్లు నిర్ధారించామని చెప్పారు. ఈ నెల 17న వీడియో ఎండోస్కోపీ ద్వారా స్వరాన్ని విశ్లేషిస్తూ థైరోప్లాస్టీ–1 అనే అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం రోగి మామూలుగా మాట్లాడగలుగుతున్నా­రని చెప్పారు.

ఈ శస్త్ర చికిత్సలో ఈఎన్‌టీ వైద్యు­లు, అసోసియేట్‌  ప్రొఫెసర్‌ డాక్టర్‌ లీలాప్రసాద్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు రత్నబాబు, శ్రీనివా­స్, ఆదిత్య, స్పందన, వర్థిని, పీటర్‌లతో పాటు పీజీ విద్యార్థులు, స్పీచ్‌ థెరపిస్ట్‌ జి గాయత్రి, మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్‌ వెంకటేశ్వరరావు, డాక్టర్‌ లవకుమార్‌ పాల్గొన్నారు. వైద్య బృందాన్ని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేష్‌ అభినందించారు.

మరిన్ని వార్తలు