కొవ్వూరు : గోదావరి వరద తీవ్రత 3 రోజులుగా నిలకడగా కొనసాగుతోంది. ఎగువ భద్రాచలంలో నీటిమట్టం మంగళవారం మధ్యాహ్నం నుంచి క్రమేణా పెరుగుతోంది. ఉదయం ఆరు గంటలకు 31.30 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం ఆరుగంటలకు 36.90 అడుగులకు పెరిగింది. దీంతో దిగువనున్న పోలవరం, కొవ్వూరు, ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద తీవ్రత బుధవారం ఉదయానికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 8 అడుగులుగా నమోదైంది. ఆనకట్ట వద్దకి 3,83,210 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 10,400 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. ఆనకట్టకు నాలుగు ఆర్మ్్సలో ఉన్న 175 గేట్లును మీటరు ఎత్తులేపి 3,72,810 క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నుంచి సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతంలో నీటిమట్టాల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం నుంచి ఇన్ఫ్లో మరింత పెరిగే సూచనలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.