కర్నూలు నాటకానికి బంగారు గరుడ అవార్డు

22 Dec, 2016 05:13 IST|Sakshi
– సంగా ఆంజనేయులకు ఉత్తమ హాస్య నటుడు అవార్డు
కర్నూలు (కల్చరల్‌):  కర్నూలు లలిత కళా సమితి కళాకారులు తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రదర్శించిన ప్రమీలార్జున పరిణయం నాటకానికి బంగారు గరుడ అవార్డు లభించిందని లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ఎంపీ శివప్రసాద్‌ చేతుల మీదుగా నాటకంలోని శ్రీకృష్ణ పాత్రధారి శ్రీనివాసరెడ్డి ఈ అవార్డును అందుకున్నారన్నారు. ఈ నాటకాన్ని ప్రముఖ రచయిత పల్లేటి లక్ష్మి కుల శేఖర్‌ రచించగా, పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర కళా పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 13 నాటకాలు ప్రదర్శించగా కర్నూలుకు చెందిన ఈ నాటకానికి బంగారు గరుడ అవార్డు లభించండం హర్షణీయమని టీజీవీ కళాక్షేత్రం చైర్మెన్‌ టీజీ భరత్, లలిత కళా సమితి అధ్యక్షులు నాటక దర్శకులు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్‌ మియా, సహాయ కార్యదర్శి ఇనాయతుల్లా, రంగస్థల నటులు వన్నెం బలరామ్‌ తెలిపారు. నాటకంలో హాస్యపాత్ర పోషించిన సంగా ఆంజనేయులకు ఉత్తమ హాస్య నటుడు అవార్డు లభించింది. ఈ నాటకానికి రూ.70 వేల నగదు పారితోషికం వెంకటేశ్వర కళా పరిషత్‌ అందించింది. 
మరిన్ని వార్తలు