చేనేతలను విస్మరించిన ప్రభుత్వం

25 Sep, 2016 23:48 IST|Sakshi
చేనేతలను విస్మరించిన ప్రభుత్వం
కోడుమూరు రూరల్‌ : చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల మర్రి బాలకృష్ణ ఆరోపించారు. స్థానిక సుందరయ్య భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి చేనేత కార్మికుల సమావేశానికి బాలకృష్ణతోపాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు జేఎన్‌.శేషయ్య ముఖ్యాతిథులుగా హాజరయ్యారు. జిల్లాలో 15నెలలుగా చేనేత కార్మికులకు పట్టు సబ్సిడీ సొమ్మును సర్కారు ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల ముందు చేనేత రంగం, కార్మికుల అభివద్ధికై ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక హామీలు గుప్పించి, ప్రస్తుతం వాటి అమలుపై తాత్సారం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చేనేత రుణాల రద్దుకు తొలిసంతకం చేస్తానని చెప్పిన చంద్రబాబు మూడేళ్లవుతున్నా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని చేనేత రుణాలను రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న పట్టు సబ్సిడీని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు రాజు, స్థానిక నేతలు కాలప్ప, ఆదెన్న, ఎల్లప్ప, వీరన్న, కుమార్, వెంకటేశ్వర్లు, బసప్ప, లక్ష్మన్న, నీలకంఠప్ప, రమేష్, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు