సి.బెళగల్: సి.బెళగల్లోని ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం (బైపీసీ) చదువుతున్న విద్యార్థి సురేష్బాబు ఎవరెస్ట్ అధిరోహించారు. గోనెగండ్లకు చెందిన కర్రెన్న, సువర్ణ దంపతుల కుమారుడైన ఈ విద్యార్థి శనివారం తెల్లవారుజామున 5–48 గంటలకు ఎవరెస్ట్ ఎక్కినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ మనోహరరావు తెలిపారు. ఈ సమాచారం గురకులం సంస్థ కార్యదర్శి, కల్నల్ రాములు ఫోన్లో తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు.
ఎవరెస్ట్ అధిరోహణకు రాష్ట్రం తరపున 16 మంది విద్యార్థులను 2016 ఆగష్టున అధికారులు ఎంపికచేయగా పాఠశాలకు చెందిన సురేష్ బాబు అందులో ఒకరన్నారు. ఆత్మవిశ్వాసంతో తమ విద్యార్థి శిఖరం అధిరోహించి కళాశాలకు పేరు తీసుకొచ్చారని శనివారం విలేకరుల సమావేశంలో సంతోషం వ్యక్తం చేశారు. చదువులోనూ ఈ విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని 1000కి 882 మార్కులు సాధించారని వెల్లడించారు. అనంతరం సురేష్బాబు శిక్షణ విశేషాలను వెల్లడించారు.