ఓటుకు కోట్లు కేసులో తీర్పు వాయిదా

12 Dec, 2016 14:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో హైకోర్టు మంగళవారం తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై తెలంగాణ ఏసీబీ సరిగా దర్యాప్తు చేయడం లేదంటూ వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ప్రత్యేక న్యాయస్థానం దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ జరిపి ఏసీబీ కోర్టు ఆదేశాలపై స్టే విధించిన హైకోర్టు బాబు వ్యాజ్యంపై ఇటీవల విచారణ ప్రారంభించింది. గతవారం అందరి న్యాయవాదుల వాదనలు పూర్తయినప్పటికీ, ఆయా న్యాయవాదులు తమ తమ వాదనల సందర్భంగా ప్రస్తావించిన సుప్రీంకోర్టు తీర్పుల కాపీలను అందచేయాలని న్యాయమూర్తి ఆదేశించా రు. ఇందుకు గాను కేసు విచారణను మంగళవారానికి వాయిదావేశారు. మంగళవారం కేసు విచారణకు వచ్చినప్పుడు న్యాయవాదులు తీర్పు కాపీలను కోర్టు సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు