బోర్డు మాత్రమే మిగిలింది

15 Dec, 2015 03:31 IST|Sakshi
బోర్డు మాత్రమే మిగిలింది

శామీర్‌పేట్: గుర్తుతెలియని వ్యక్తులు ఓ హోటల్‌కు నిప్పంటించారు. ఈ సంఘటన శామీర్‌పేట్ మండలపరిధిలోని పెద్దచెరువు శివారులో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. శామీర్‌పేట్‌కు చెందిన ఎం. శ్రీనివాస్ కొన్నేళ్లుగా మేడ్చల్ మండల పరిధిలోని మెడిసిటీ సమీపంలో (శామీర్‌పేట్ పెద్ద చెరువు శివారులో) ఓ గది అద్దెకు తీసుకొని చిన్నపాటి హోటల్ నిర్వహిస్తున్నాడు.

 ఎప్పటిమాదిరిగా ఆదివారం రాత్రి ఆయన కొట్టు మూసివేసి ఇంటికి వ చ్చాడు. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఆయన హోటల్‌కు నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో శ్రీనివాస్ అక్కడికి వెళ్లేసరికి హోటల్ పూర్తిగా కాలిపోయి కేవలం బోర్డు మాత్రమే మిగిలి ఉంది. తన బతుకు రోడ్డున పడిందని, రూ.50 వేలు విలువైన ఆస్తినష్టం జరిగిందని బాధితుడు కన్నీటిపర్యంతమైంది. ఈమేరకు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు