వందశాతం మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యం

7 Oct, 2016 23:26 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి
 
– జీవనోపాధుల మెరుగుకు ప్రత్యేక చర్యలు 
– డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి 
చిత్తూరు (కలెక్టరేట్‌): 
గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యంగా కషి చేయాలని డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయంలో వెలుగు సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు ముందస్తుగా నిధులను వెలుగు ఆధ్వర్యంలో సమకూర్చాలన్నారు. పనులు పూర్తయిన వాటికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల నుంచి రికవరీ చేసుకోవాలన్నారు. వర్మీకంపోస్టు తయారీ తొట్టెల నిర్మాణాలను కూడా మహిళా రైతుల పొలాల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మించిన మరుగుదొడ్లు, వర్మీకంపోస్టులను జియోట్యాగింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి క్లస్టర్‌ కో ఆర్డినేటర్‌ ఈ ఏడాదిలోగా రెండు పంచాయతీలను పూర్తి స్థాయిలో అభివద్ది పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకు లింకేజి ద్వారా పొందిన రుణాలను పూర్తిగా చెల్లించి, మరో రుణంకోసం ఎదురు చూస్తున్న సంఘాలకు వెంటనే రుణాలు అందించాలన్నారు. సంఘాల్లోని మహిళలకు వ్యవసాయేతర  జీవనోపాధుల మెరుగుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో స్త్రీనిధి ఏజీయం వెంకటప్రకాష్‌నాయుడు, డీపీయంలు ప్రభావతి, నరసింహారెడ్డి, రవి, సీసీలు తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు