జేసీ సోదరుల అండతోనే ఇసుక అక్రమ రవాణా

6 Aug, 2017 22:42 IST|Sakshi

తాడిపత్రి రూరల్‌: తాడిపత్రిలో జేసీ సోదరుల అండతోనే ఇసుక అక్రమ రవాణా సాగుతోందని, మైనింగ్‌ అధికారి ప్రతాప్‌రెడ్డిని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాడిపత్రి ప్రాంతంలో జేసీ సోదరుల అరాచకాలు మితిమీరిపోతున్నాయన్నారు. వారి అండచూసుకుని కొందరు ‘పచ్చ’ నేతలు ఏడీ మైనింగ్‌ అధికారి ప్రతాప్‌రెడ్డిపై దౌర్జన్యానికి దిగుతున్నారని, అలాగే ఎమ్మెల్యే ఫోన్‌లో బెదరించాన్నారు. ఆ అధికారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు.

ప్రతాప్‌రెడ్డి అక్రమ మైనింగ్‌పై దాడులు చేపట్టి ప్రతి ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చారని, ఇలాంటి ఆధికారిని అధికారిని బెదిరించడం దారుణమన్నారు. ప్రాణహాని ఉందని  ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందేనన్నారు. ఆయనను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తాడిపత్రి ప్రాంతం నుంచి రోజూ 300 ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోందని రెవెన్యూ, పోలీసు అధికారులు మామూళ్లు తీసుకుని మాఫియాను సాగిస్తున్నారని విమర్శించారు. ఎస్పీ ఆశోక్‌కుమార్‌ స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి తాగునీటి ఎద్దడిని కాపాడాలని తెలిపారు.

మరిన్ని వార్తలు