చంద్రబాబుపై మరో కేసు నమోదు

2 Nov, 2023 16:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఏపీఎమ్‌డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.  ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేశారనే ఫిర్యాదుతో సీఐడీ అధికారులు.. చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.

చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి చంద్రబాబు రూ. 100 కోట్ల జరిమానా విధించింది నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌,.

ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డ ఓ మహిళా ఎమ్మార్వోపై నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తెగబడ్డ దాష్టీకానికి అప్పట్లో యావత్తు రాష్ట్రం విస్తుబోయింది. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లటం ఎవ్వరూ మరిచిపోలేరు. 

కాకపోతే ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరే అన్నిటికన్నా హైలైట్‌. ఇదేదో గట్టుకింద తగవు మాదిరి... వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేసే సిగ్గుమాలిన ప్రయత్నం చేశారు. అంతేకాని చింతమనేనిపై కేసు పెట్టడానికి మాత్రం చంద్రబాబుకు మనసొప్పలేదు.

తవ్వు కోవడం.. దండకోవడం..!
చంద్రబాబు  హయాంలో ఇసుక దిన్నె(రీచ్‌)లను గ్రామైక్య సంఘాలకు అప్పగించి, తద్వారా అక్రమ రవాణికు అడ్డుకట్ట వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం బెడిసికొట్టింది. అనంతపురం జిల్లాలో మూడు చోట్ల పెన్నా, చిత్రావతి నదుల్లో ఇసుక తవ్వి అమ్ముకోవడానికి ప్రభుత్వం గ్రామైక్య సంఘాలకు అనుమతి ఇవ్వగా, ఇసుక తవ్వకాల్లో కనీస ప్రమాణాలు పాటించకుండా నదుల్లో ఇష్టానుసారం ఇసుక తవ్వేశారు..
 చదవండి: తవ్వుకో.. దండుకో..!

చంద్రబాబు సాక్షిగానే రెచ్చిపోయారు..
చంద్రబాబు హయాంలో గుంటూరు జిల్లాలో ప్రకృతి సహజ సంపద అయిన ఇసుకను అక్రమంగా దోచేస్తూ అప్పటి అధికార పార్టీ నేతలు జేబులు నింపుకున్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా, ధనార్జనే ధ్యేయంగా వీరు డ్రెడ్జర్లు, పొక్లెయినర్లతో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు. ఇసుక అక్రమ దందాలో జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి, మరో ఐదుగురు సీనియర్‌ టీడీపీ నేతలు వారి బంధువులు, అనుచరులు ఇసుక మాఫియా నడుపుతుండటంతో అధికారులు సైతం వీరి జోలికి వెళ్లలేదు. కూలీలను తొలగించి ప్రొక్లయినర్ల ద్వారా ట్రాక్టర్లు, లారీల్లో లోడు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు దండుకున్నారు.
ఇది చదవండి: పట్టపగలే దోపిడీ

చెలరేగిపోయిన ఇసుకమాఫియా
చంద్రబాబు హయాంలో ప్రకాశం బ్యారేజీకి దిగువన 50 మీటర్ల దూరంలోనే అడ్డగోలుగా కృష్ణానదిలో ఇసుకను తవ్వేశారు. ఎన్‌జీటీ ఉత్తర్వులు బేఖాతరు చేసి మరీ ఇసుకను తవ్వేశారు. దాంతో బ్యారేజీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దల దన్నుతోనే ఇసుక మాఫియా అలా చెలరేగిపోవడం అప్పట్లో విస్మయానికి గురిచేసింది.
ఇది చదండి: ప్రకాశం బ్యారేజీకి ముప్పు!

చంద్రబాబుపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు

మరిన్ని వార్తలు