మానవతావాది జేవీ రాముడు

2 Aug, 2016 23:59 IST|Sakshi
మానవతావాది జేవీ రాముడు

అనంతపురం సెంట్రల్‌ : మాజీ డీజీపీ జేవీ రాముడు గొప్ప మానవతావాది అని వక్తలు కొనియాడారు. ఇటీవల రాష్ట్ర డీజీపీగా పదవీ విరమణ పొందిన జేవీ రాముడుకు మంగళవారం జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్‌ కన్వెన్షన్‌ హాలులో ఆత్మీయ సన్మానసభ నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబం నుంచి అత్యున్నత శిఖరాలను అధిరోహించారని కొనియాడారు.

ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ జేవీ రాముడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడడంతో పాటు, సమస్యను  సావధానంగా వినడం ఆయనకున్న గొప్ప వరమన్నారు. డీజీపీగా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, బీకే పార్థసారథి, వరదాపురం సూరి, ఎమ్మెల్సీలు మెట్టుగోవిందరెడ్డి, శమంతకమణి తదితరులు మాట్లాడుతూ జేవీ రాముడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరారు.

అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు జేవీ రాముడు, పద్మజ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గేయానంద్, జెడ్పీ చైర్మన్‌ చమన్, మేయర్‌ స్వరూప, డీఐజీ ప్రభాకర్‌రావు, కలెక్టర్‌ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, వైఎస్సార్‌సీపీ నాయకులు మహాలక్ష్మి శ్రీనివాసులు, పోలీస్‌ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, డీఎస్పీలు, సీఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు