ముగిసిన నాటక పోటీలు

14 Mar, 2017 18:59 IST|Sakshi
ముగిసిన నాటక పోటీలు
ఉత్తమ ప్రదర్శనగా ’చాలు..ఇక చాలు’
పాలకొల్లు టౌన్‌: సమాజంలోని రుగ్మతలను పాలద్రోలి ప్రజలను చైతన్యవంతులను చేసే శక్తి నాటకరంగానికి ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం రాత్రి  డాక్టర్‌ గజల్‌ శ్రీనివాస్‌ పాలకొల్లు కళాపరిషత్‌ పదో జాతీయ స్థాయి నాటిక పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటక రంగం కనుమరుగు కాకుండా భావితరాలకు అందించడానికి కళాపరిషత్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆ నాటి కళాకారుడు, ప్రముఖ సినీ, నాటక దర్శకుడు పినిశెట్టి శ్రీరామమూర్తి దగ్గర నుంచి నేటి తరం గజల్‌ శ్రీనివాస్‌ వరకు ప్రపంచ ఖ్యాతి సంపాదించి కళలతకు పుట్టినిల్లుగా పాలకొల్లు భాసిల్లుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కళాపరిషత్‌లు నిర్వహించడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజల్‌ శ్రీనివాస్, విన్నకోట వేంకటేశ్వరరావు, డాక్టర్‌ కేఎస్‌పీఎన్‌ వర్మ, మేడికొండ శ్రీనివాసచౌదరి, కేవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, రంగస్థల వృత్తి కళాకారుల సంఘ జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు, గుండా రామకృష్ణ, రాయప్రోలు భగవాన్, బుద్దాల వెంకట రామారావు, జీవీబీఎస్‌ మూర్తి, జి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 
 
ఉత్తమ ప్రదర్శనగా ’చాలు.. ఇక చాలు’
ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా శ్రీ సాయి ఆర్ట్స్‌కొలకలూరి వారి ’చాలు..ఇక చాలు’ నాటిక ఉత్తమ మొదటి బహుమతిని గెలుచుకుంది. అభినందన ఆర్ట్స్‌గుంటూరు వారి ’కేవలం మనుషులం’, అరవింద ఆర్ట్స్‌తాడేపల్లి వారి ’స్వర్గానికి వంతెన’ నాటికలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించకున్నాయి. జ్యూరీ ప్రదర్శనగా ’నాన్నా.. నువ్వో సున్నా’ నిలిచింది. దిష్టిబొమ్మలు నాటక రచయిత తాళాబత్తుల వేంకటేశ్వరరావు ఉత్తమ రచయితగా, నాన్నా నువ్వో సున్నా నాటిక దర్శకుడు పి.బాలాజీనాయక్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. చాలుఇక చాలులో నీలకంఠం పాత్రధారి కేవీ సుబ్బారాయుడు ఉత్తమ నటుడిగా, దిష్టిబొమ్మలు నాటికలో జానకమ్మ పాత్రధారిణి ఎం.లక్ష్మతులసి ఉత్తమ నటిగా, గోవు మాలచ్చిమిలో గోవిందయ్య పాత్రధారి జానా రామయ్య ఉత్తమ ప్రతినాయకుడిగా, సందడే..సందడి నాటికలో దొంగ పాత్రధారుడు కె.జోగారావు ఉత్తమ హాస్య నటుడిగా, కేవలం మనుషులం నాటికలో మీర్జా ఆలీఖాన్‌ పాత్రధారి వీసీహెచ్‌కే ప్రసాద్ ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎంపికయ్యారు. ఈ  పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రసాదరెడ్డి (హైదరాబాద్‌), కేకేఎల్‌ స్వామి (విజయనగరం), విన్నకోట వేంకటేశ్వరరావు (పాలకొల్లు) వ్యవహరించారు. 
 
 
 
మరిన్ని వార్తలు