చంద్రబాబుకు షాకిచ్చిన కాపు నేతలు

22 May, 2016 15:38 IST|Sakshi
చంద్రబాబుకు షాకిచ్చిన కాపు నేతలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కాపు పథకాలకు సీఎం చంద్రబాబునాయుడు పేరు పెట్టడంపై కాపు నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. విజయవాడలో ఆదివారం ఉదయం కాపు నేతలు చంద్రబాబుతో భేటీయ్యారు.

ఈ భేటీలో కాపులకు ఇస్తున్న ఉపకార వేతనాలు,  విదేశీ విద్య, రుణాల వంటి ప్రభుత్వ పథకాలతో పాటు కాపు సంక్షేమ భవనాలకు చంద్రబాబు పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కాపు భవనాలకు జిల్లాలో కాపు సామాజిక వర్గం కోసం పోరాడిన నాయకుల పేర్లు పెట్టాలని నేతలు సూచించారు. కాపు పథకాలకు చంద్రన్న పేరు పెట్టడం వల్ల రాష్ట్రంలో కాపులు టీడీపీకి దూరమౌతారని హెచ్చరించినట్లు సమాచారం. కాపు నేతల హెచ్చరికతో బాబు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆగమేఘాల మీద సీఎంవో అనుమతి లేకుండా ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టొద్దని సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సీఎంవో అనుమతి తీసుకున్నాకే ప్రభుత్వ పథకాలపై ముందుకెళ్లాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు