న్యాయం చేయాలని ప్రియురాలి దీక్ష

24 Jul, 2016 09:57 IST|Sakshi
న్యాయం చేయాలని ప్రియురాలి దీక్ష
ముమ్మిడివరం: ప్రేమ వివాహం చేసుకుని, తల్లిదండ్రులు నిరాకరించడంతో ప్రియురాలిని వదిలించుకోవాలనుకున్న యువకుడి ఇంటి ముందు ఓ యువతి నిరసర దీక్ష చేపట్టింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్రేయ పురం మండలం పేరవరానికి చెందిన వేముల దుర్గ తన అమ్మమ్మ స్వగ్రామమైన ముమ్మిడివరం మండలం అయినాపురం శివారు చిట్టి చెరువులో కొంతకాలంగా ఉంటుంది. అదే గ్రామానికి చెందిన శెనగల కృపాపాల్‌ ఏడాదిగా ఆమెతో ప్రేమ వ్యవహారం సాగించాడు.

నెల రోజుల క్రితం ఆమె పేరవరంలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం కృపాపాల్‌ అక్కడకు వెళ్లి, దుర్గను వెంట తీసుకొచ్చాడు. స్థానిక మహిపాల చెరువు వద్ద కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కృపాపాల్‌ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అతడి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పి, దుర్గను కోడలిగా అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. దీంతో కృపాపాల్‌ ఆమెను కాట్రేనికోనలో వదిలిపెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా, గుడిలో వివాహం చేసుకున్న కృపాపాల్‌ తనతో కాపురం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి నుంచి అతని ఇంటి ఎదుట దుర్గ  నిరసన దీక్ష చేపట్టింది. ముమ్మిడివరం ట్రైనీ ఎస్సై ఎస్‌.రవికుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని, ఆమె వద్ద నుంచి వివరాల సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని వార్తలు