జూలూరుపాడు: ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 664 మలేరియా, 71 డెంగీ కేసులు నమోదైనట్లు జిల్లా మలేరియాధికారి(డీఎంఓ) డాక్టర్ ఏ.రాంబాబు తెలిపారు. సోమవారం జూలూరుపాడులో ఆర్ఎంపీ, డయాగ్నస్టిక్ సెంటర్లను తనిఖీచేసి విలేకరులతో మాట్లాడారు. గతేడాది 1,822 మలేరియా కేసులు, డెంగీ 439, చికున్ గున్యా 54 కేసులు నమోదయ్యాయని, ఈసారి తక్కువగానే ఉన్నాయని తెలిపారు. మంచుగొండ పీహెచ్సీ పరిధిలో 14 డెంగీ కేసులు, వైరాలో 4, కొణిజర్లలో 4, ఖమ్మంలో 9, పాత అంజనాపురం, ఆళ్లపల్లి, మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో 40 డెంగీ కేసులను గుర్తించామని వివరించారు. కార్యక్రమంలో జూలూరుపాడు క్లస్టర్(సీహెచ్ఎన్సీ) ఎస్పీహెచ్ఓ డాక్టర్ పి.వినోద్, సీహెచ్ఓ పాపయ్య పాల్గొన్నారు.
జూలూరుపాడులో ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న వైద్యశాలలను జిల్లా మలేరియా అధికారి ఏ. రాంబాబు, జూలూరుపాడు(సీహెచ్ఎన్సీ) క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ పోటు వినోద్ సోమవారం తనిఖీ చేసి..డెంగీ, «థైరాయిడ్ టెస్టులు చేయొద్దని హెచ్చరించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకోవద్దని, బోర్డులపై క్లీనిక్, వైద్యశాల అని రాయొద్దని సూచిస్తూ..షోకాజు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ డయాగ్నస్టిక్ సెంటర్ను సీజ్ చేశారు.