అంబరాన్నంటిన ‘నూతన’ సంబరాలు

1 Jan, 2017 22:26 IST|Sakshi

నోరూరించే వంటలు..వెరైటీ కేక్‌లు
అర్ధరాత్రి దాటే వరకూ సంబరాలు
వేడుకలు ఘనంగా జరుపుకున్న ప్రజానీకం

నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజానీకం ఘనంగా జరుపుకుంది. అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. కొత్త సంవత్సరానికి నోరూరించే రుచులు..వెరైటీ కేక్‌లు స్వాగతం పలికాయి. జిల్లా యావత్‌ ప్రజలు సంబరాల్లో మునిగితేలారు. 2016కు వీడ్కోలు చెబుతూ 2017కు స్వాగతం పలికారు.

నిర్మల్‌రూరల్‌ : ‘హ్యాపీ న్యూ ఇయర్‌...’ అంటూ జిల్లావాసులు జోష్‌గా 2017కు స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం నుంచే మొదలయిన న్యూఇయర్‌ వేడుకలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగాయి. కేక్‌లు కట్‌ చేస్తూ ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మార్కెట్‌లో సందడి నెలకొంది. బేకరీలు కిటకిటలాడాయి. నోరూరించే నాన్ వెజ్‌ వంటకాలను తీసుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు.   

జిల్లా కేంద్రంలోని శాస్రీ్తనగర్, దివ్యనగర్‌లో గల వాసవి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్‌లు తినిపించుకుంటూ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాఠశాలల ప్రిన్సిపాల్‌లు సుహాసిని, రాందాస్, డైరెక్టర్‌ జగదీశ్‌రెడ్డి, కరస్పాండెంట్‌ పోతారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. దీక్ష డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ప్రిన్సిపాల్‌ మెంగ శ్రీధర్‌ కేక్‌ కట్‌ చేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.  

ఖానాపూర్‌ :  నూతన సంవత్సర వేడుకలను పట్టణ ప్రజానీకం స్వాగతం పలికింది. బేకరీ దుకాణాలు కేక్‌ల కొనుగోలుదార్లతో సందడిగా మారాయి. ఇదే అదనుగా నిర్వహకులు వివిధ రకాల ఆఫర్లు పెట్టి వ్యాపారం చేసుకున్నారు. యువత అర్ధరాత్రి దాటే వరకూ సంబరాల్లో మునిగితేలారు.  

మరిన్ని వార్తలు